పంచాయతీరాజ్ సమ్మేళన్‌లో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. అభివృద్ధిపై వాదులాట!

  • నల్గొండ మార్కెట్ కమిటీ ఆవరణలో కార్యక్రమం
  • కంచర్ల భూపాల్‌రెడ్డి మాటలను అడ్డుకున్న కోమటిరెడ్డి
  • ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం
తమ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే.. లేదు, మా ప్రభుత్వ హయాంలోనే జరిగిందంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేదికపైనే వాదులాడుకున్నారు. ఒకానొక సమయంలో ఇద్దరూ ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లడానికి సిద్ధపడుతుండగా, పోలీసులు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

నల్గొండ జిల్లాలో జరిగిందీ ఘటన. పంచాయతీరాజ్ సమ్మేళన్‌లో భాగంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొంటూ తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఏకరవు పెట్టారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లేచి ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వ హయాంలోనే అమలయ్యాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు ఎక్కడా సరిగా అమలు కావడం లేదన్నారు. దీంతో కంచర్ల, కోమటిరెడ్డి మధ్య వాగ్వివాదం మొదలైంది. అక్కడే ఉన్న ఇరు పార్టీల కార్యకర్తలు తమ నాయకులకు మద్దతుగా నినాదాలు చేశారు. వేదికపై గొడవ మరింత ముదిరి ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

Komatireddy Raj Gopal Reddy
Nalgonda District
kancharla
TRS
Congress

More Telugu News